హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగతికి రూ.1394 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలకు కలిపి రూ.రూ.4724 కోట్లు ప్రతిపాదించింది.
గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంతోపాటు అన్నిరకాల మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో చెత్త సేకరణతోపాటు వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి ఊరికి ఒక డంపుయార్డును ఏర్పాటు చేసింది, పారిశుద్ధ్య నిర్వహణకు 12769 ట్రాక్టర్లను కొనుగోలు చేసింది. రూ.330 కోట్లతో కొత్త విద్యుత్ స్తంభాలను అమర్చడంతోపాటు ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసింది. అన్ని గ్రామాల్లో వైకుఠధామాలను నిర్మించి, వాటి నిర్వహణకు ప్రతి నెల రూ.227.5 కోట్లు విడుదల చేస్తున్నది.
రాష్ట్రంలో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేయడానికి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు అర్బన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 1602 నర్సరీలను ఏర్పాటు చేసింది. వెజ్-నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను నిర్మించడంతోపాటు అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నది.