హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ బడ్జెట్ కేటాయింపులను ఏటికేడు పెంచుతూవస్తున్నారు. నిరుడు ఏకంగా రూ.11,440 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తూ ఏకంగా రూ.12,161 కోట్లు కేటాయించారు. నిరుడితో పోల్చితే ఇది రూ.721 కోట్లు అదనం. రాష్ట్ర చరిత్రలోనే ఇది మరో రికార్డుగా నమోదైంది.
నిరుడితో పోల్చితే ఈ ఏడాది కేటాయింపులు దాదాపు 6.5 శాతం పెరిగాయి. 2019-20 బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే ఈ సారి ఏకంగా రెట్టింపుకన్నా ఎక్కువగా (110 శాతం) నమోదయ్యాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్కు కూడా నిధులు భారీగానే కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, ఎంఎన్జే, నిమ్స్ తదితర వాటికి కలిపి రూ.2,080.43 కోట్ల కేటాయింపులు జరిగాయి.