సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. వాటిని కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెల్వదు. ప్రాజెక్టులపై కేంద్రానికి పెత్తనం ఇస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మేం ఏనాడూ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్టులు కేంద్ర అధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. ప్రజా ప్రయోజనాలు వదిలి కాంగ్రెస్ నేతలు అవగాహన లేమితో ఏదేదో మాట్లాడుతున్నరు.
శాసనసభలో ఇప్పుడు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలున్నారు. 39 మంది అంటే ఆషామాషీ నంబర్ కాదు. ప్రభుత్వం మెడలు వంచే వరకు మన ఎమ్మెల్యేలు సభలో కొట్లాడుతరు. సభ బయట ప్రజల్లో ఉండి నాయకులు కొట్లాడుతరు. ఆరునూరైనా నల్లగొండలో సభ పెట్టి తీరుతం. బీఆర్ఎస్ కార్యకర్తలకు కొట్లాడటం కొత్తకాదు. ఉద్యమకాలంలో అనేక పోరాటాలు చేసినం. జిట్టా బాలకృష్ణారెడ్డీ.. మనం మళ్లా పాత రోజులు గుర్తు చేసుకుందాం.. కొట్లాటకు సిద్ధమవుదామా? నల్లగొండలో తల్వార్లు తిప్పుదామా రవీందర్సింగ్?
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేండ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించలేదు. ఏకపక్షంగా నోటిఫై చేస్తామని కేంద్ర జల్శకి ్తశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఒక సందర్భంలో బెదిరించారు. కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో, ప్రాజెక్టులను మాత్రం అప్పగించం అని తేల్చి చెప్పిన. నా ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరుకోను. రాష్ర్టాన్ని పదేండ్లు పదిలంగా కాపాడుకున్నం. ఇప్పుడు పరాయివాళ్ల పాలు చేస్తున్నరు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కి పోడు. ఉడుత ఊపుకులకు, బెదిరింపులకు భయపడం.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారత రాష్ట్ర సమితి ఎంతవరకైనా కొట్లాడుతుందని, ఈ విషయంలో ఎవ్వరితోనూ రాజీపడబోదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దానిని దేశానికే రోల్మాడల్ తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పాలనకే దక్కుతుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో సమావేశం జరిగింది.
కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి కలిగే నష్టాలు, పర్యవసానాల గురించి కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు సుదీర్ఘంగా వివరించారు. కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హకులను కాపాడుకొనేందుకు, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర, మూర్ఖ వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను, ప్రాజెక్టులపై హకులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడాల్సిందేనని సమావేశం ముక్తకంఠంతో ప్రకటించింది.
కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణ హకులను లాక్కొనేందుకు కేంద్రం వేసిన ఎత్తులను పదేండ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే అవగాహనా రాహిత్యంతో సంతకాలు చేసి భవిష్యత్తులో ప్రాజెక్టు మీదికి కూడా పోలేని పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. దీన్ని ప్రజామద్దతుతో తిప్పికొడుతామని ప్రకటించారు. నల్లగొండలో భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. ‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేండ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదు. ప్రాజెక్టులు అప్పగించాలని, లేదంటే ఏకపక్షంగా నోటిఫై చేస్తామని ఒక సందర్భంలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బెదిరించారు. కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో, ప్రాజెక్టులను మాత్రం అప్పగించబోమని తేల్చి చెప్పిన. నా ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరుకోను.. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే స్పష్టంగా చెప్పాను. రాష్ర్టాన్ని పదేండ్లు పదిలంగా కాపాడుకున్నాం. ఇప్పుడు దాన్ని పరాయివాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కి పోడు. ఉడుత ఊపుకులకు, బెదిరింపులకు భయపడం’ అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా కొట్లాడ్తం.. ఈ విషయంలో
ఎవ్వరితోనూ రాజీపడం.
– కేసీఆర్
బీఆర్ఎస్ను లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతల ప్రకటనలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ (సీఎం రేవంత్) వల్ల కాదు. నీకన్నా హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది. ఎంతో మందిని చూసినం. పెద్దపెద్ద వాళ్లే ఏమీ చేయలేకపోయారు’ అని స్పష్టంచేశారు. ‘కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు వెళితే రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాములకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుం ది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్టు కేంద్ర అధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు’ అని కేసీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే, కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది.
– కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో సంతకాలు చేసి భవిష్యత్తులో ప్రాజెక్టు మీదికి కూడా పోలేని పరిస్థితి తెచ్చింది. దీన్ని ప్రజామద్దతుతో తిప్పికొడతాం.
– కేసీఆర్
నన్ను, నా పార్టీని ఎవరూ టచ్ చేయలేరు. హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. ఎంతో మందిని చూసినం. పెద్దపెద్ద వాళ్లే ఏమీ చేయలేకపోయారు.
– కేసీఆర్
శాసనసభలో కూడా కేఆర్ఎంబీ విషయమై పోరాడుదామని కేసీఆర్ చెప్పారు. ‘శాసనసభలో ఇప్పుడు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలున్నారు. 39 మంది అంటే ఆషామాషీ నంబరు కాదు. ప్రభుత్వం మెడలు వంచే వరకు మన ఎమ్మెల్యేలు సభలో కొట్లాడుతారు. మనం సభ బయట ప్రజల్లో ప్రభుత్వంపై కొట్లాడుదాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు కొట్లాడటం కొత్తకాదు. ఉద్యమకాలంలో అనేక ఉద్యమాలు చేశాం’ అని గుర్తుచేశారు. ‘జిట్టా బాలకృష్ణారెడ్డి.. మనం మళ్లా పాత రోజులు గుర్తు చేసుకుందాం.. కొట్లాటకు సిద్ధమవుదామా?’ అని కేసీఆర్ సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నారు. నల్లగొండలో తల్వార్లు తిప్పుదామా రవీందర్ సింగ్? అని సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ను ఉద్దేశించి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు గడ్డపారలు పట్టుకొని తిరగాల్సిన పని లేదని కేసీఆర్ అన్నారు. వాళ్లలో వాళ్లే (కాంగ్రెస్ నేతలు) తన్నుకుంటారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పారు. రేవంత్రెడ్డి, ఇతర మంత్రులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని, పాలన చేయడం చేతకాక అడ్డగోలుగా బీఆర్ఎస్పై మాట్లాడుతున్నారని, ప్రజాక్షేత్రంలోనే వారికి జవాబు చెప్తామని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, జీ జగదీష్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్తో, ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు తదితరులు భారీగా పాల్గొన్నారు.