హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ బయోఏషియా సదస్సు నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించే 21వ సదస్సులో 50 దేశాల నుంచి పరిశ్రమలు, ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, రెగ్యులేటరీ బాడీ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యవస్థాపకులు తదితర 3,000 మందికిపైగా పాల్గొననున్నారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన గ్లోబల్ సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లు సహా దాదాపు 70 మంది ప్రసంగాలు ఉంటాయి. డాటా, ఏఐ-రీడిజైనింగ్ పాసిబులిటీస్ థీమ్పై ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సదస్సు ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎలి లిల్లీ అండ్ కంపెనీ సీఈవో డేవిడ్ రిక్స్, బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ ఇన్కమింగ్ సీఈవో డాక్టర్ క్రిస్టోఫర్ బోర్నర్, మెడ్ట్రానిక్ చైర్మన్, సీఈవో జియోఫ్ మార్తా, నోబెల్ బహుమతి గ్రహీత, జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ స్కూల్ ప్రొఫెసర్ గ్రెగ్ సెమెంజా, ఒలింపస్ సీఈవో, ప్రెసిడెంట్ స్టెఫాన్ కౌఫ్మాన్, ప్రొవిడెన్స్ సీఈవో డాక్టర్ రాడ్హోచ్మాన్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆపరేటింగ్ పార్ట్నర్ స్టీఫెన్ స్టోఫెల్ తదితరులు సదస్సులో ముఖ్యవక్తలుగా ప్రసంగించనున్నారు. సుమారు 200 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించటంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా దేశీయ, ప్రపంచ లైఫ్సైన్సెస్, దాని అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతున్నదని తెలిపారు. ఈసారి సదస్సుకు అనేక మంది సీఈవోలు మొదటిసారి హాజరవుతున్నారని వెల్లడించారు. సదస్సును ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.