హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా రాగా, తెలంగాణ భవన్లో ఉద్యమ జోష్ కనిపించింది. తుంటికి ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచనతో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మంగళవారం భవన్లో అడుగుపెట్టగా.. పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ భవన్ను అందంగా తీర్చిదిద్దారు. పూలతో అలంకరించారు.
వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మహిళలు మంగళహారతులతో కేసీఆర్కు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కేసీఆర్ తెలంగాణ భవన్లో అడుగుపెట్టగా.. ఆ సమయంలో పార్టీ నాయకులు ఒక్కసారిగా జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన కారుకు దారి ఇవ్వడానికి.. పార్టీ కార్యకర్తలను పక్కకు జరపడానికి నాయకులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కేసీఆర్ను చూసేందుకు అందరూ పోటీ పడ్డారు. కేటీఆర్ స్వయంగా వారందరినీ పక్కకు జరుపుకొంటూ కేసీఆర్ను లోపలికి తీసుకెళ్లారు.
తెలంగాణ భవన్లో సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి కార్యాచరణపై పలు సూచనలు ఇచ్చారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించుకోవాలని సూచించినట్టు సమాచారం. సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం ద్వారా జరిగే నష్టాన్ని వివరిస్తే ప్రజలు, రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉంటుందని ఆయన వారికి తెలిపారు. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలవారీగా కేసీఆర్ మాట్లాడారు.