తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించేవారిలో తానొకడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుంటుందని తెలిపారు. న్యాయాధికారుల సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను హైకోర్టులో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు తనకు చాలా నేర్పిందని చెప్పారు.
ఎంతటి పోస్టులో ఉన్నా తాను బార్ అసోసియేషన్ సభ్యుడినేనని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని చెప్పారు. ఈ హైకోర్టులో తిరుగుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నానని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 11 ఏళ్లు పనిచేశానన్నారు. తెలంగాణ సాధన కోసం న్యాయవాదులు చాలా శ్రమించారని గుర్తుచేశారు. కేసులు లేనప్పుడు ఖాళీగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. సిద్ధయ్య క్యాంటీన్లో టీ తాగిన రోజులు నెమరేసుకున్నారు. తనను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు శతకోటి వందనాలు తెలుపుతున్నానని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.