హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి, ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తలసరి విద్యుత్ వినియోగం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఆరోగ్య లక్ష్మి అమలు, చెక్డ్యాంల నిర్మాణం, ఆరోగ్య వివరాల రికార్డులు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ప్రశ్నోత్తరాల్లో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు దళిత బంధుపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం ఈ పథకంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇవ్వనున్నారు.
మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధిపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, టౌటింగ్ చట్టం బిల్లుపై కూడా మండలిలో చర్చించనున్నారు. ఈ రెండు బిల్లులకు నిన్న శాసనసభ ఆమోదం తెలిపింది.
మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మెగా డెయిరీ ప్రాజెక్టుల ఏర్పాటు, కళాకారులకు పింఛను చెల్లింపు, జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఎన్డీపీ అభివృద్ధి కార్యక్రమం, పారిశ్రామిక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై చర్చించనున్నారు.