హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తెరా చిన్నపరెడ్డి, వీజి గౌడ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం కోసం దేశం, రాష్ట్రం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. గాంధీ చూపిన అహింసా మార్గంలో, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ ఏడేండ్లలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.