హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉండే జనాలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఓటు వేసేందుకు చాలా మంది కుటుంబసమేతంగా సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
కోఠిలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS), సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, ఉప్పల్ రింగురోడ్డు, ఆరాంఘర్, ఎల్బీనగర్ జంక్షన్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనంగా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతుండగా, బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
సాధారణ సమయాల్లో ఎంజీబీఎస్ నుంచి ప్రతి రోజు 3,500 బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 4,500 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు వెళ్లే వారి రద్దీ ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రేపు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. అదేరోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.