న్యూఢిల్లీ, జూలై 21: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26 వరకు) రూ.1,42,112 కోట్లు మోసపోయామని దేశంలోని వాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్స్, స్థానిక బ్యాంకులు కలిపి), అఖిల భారత ఆర్థిక సంస్థలు ప్రకటించాయి. ఇదే సమయంలో రూ.6,389 కోట్లు రికవరీ అయినట్టు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్రం వెల్లడించింది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో.. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన సమాచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారానే తమకు వచ్చిందని, ఆ వివరాలేవీ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద లేవని చెప్పడం గమనార్హం.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..
ఈ ఏడాది మార్చి 31దాకా 15,577 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై బకాయిల వసూలు కోసం దావాలు వేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలియజేశాయి. అలాగే 10,894 కేసుల్లో సర్ఫేసి చట్టం కింద చర్యలకు దిగామని బ్యాంకర్లు పేర్కొన్నారు. ఇక మరో 7,173 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా, ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి సర్కారీ బ్యాంకులు.. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి రూ.52,360 కోట్ల బకాయిలను వసూలు చేశాయి. అలాగే మోసంగా వర్గీకరించిన ఖాతాల నుంచి రికవరీ ప్రక్రియ కొనసాగుతున్నదని, ఆర్బీఐ లెక్కల ప్రకారం సదరు ఖాతాల నుంచి గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,389 కోట్ల రికవరీ జరిగిందని చౌదరి ఈ సందర్భంగా పార్లమెంట్కు తెలియజేశారు.
రికవరీ ఏజెన్సీలపై..
2025-26లో రికవరీ ఏజెన్సీలకు సంబంధించి బ్యాంకులపై 18,021 ఫిర్యాదులను అందుకున్నామని సహాయ మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెట్టింపునకుపైగా పెరిగాయని చెప్పారు. నాడు 8,623 ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొన్నారు. వేధింపులతో కూడిన రుణాల వసూళ్ల ప్రక్రియల నుంచి రుణగ్రహీతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామననారు.