Telangana Assembly Elections | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించాలనే ఎన్నికల సంఘం నిబంధన కారణంగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల మైకులు మూగబోయాయి. 5 గంటలకు ముందే పార్టీల అభ్యర్థలు తమ ప్రచారాన్ని ముగించుకున్నారు. చివరి రోజైనా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలు బైక్ ర్యాలీలు, రోడ్ షోలు భారీగా నిర్వహించి, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇక రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియగా, 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగిసింది. ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున సీఎం కేసీఆర్ గజ్వేల్తో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.