హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఈ అంశంపై మంగళవారం కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పలు పెండింగ్ సమస్యలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి ఏడాది కాలపరిమితితో మాత్రమే తాత్కాలిక ఒప్పందం కుదిరిందని.. అది కూడా రాష్ర్టాల ఏర్పాటుకు ముందు ఆయా ప్రాంతాలు వినియోగించుకొన్న నదీ జలాల నిష్పత్తి 66ః34 ప్రకారం ఆ ఏడాది వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొన్నదని గుర్తుచేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను వేసి నీటి పంపకాలను చేపట్టాలని కోరిందని పేర్కొన్నారు. సెక్షన్ 3 అంశాన్ని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తినప్పుడు జల్శక్తి శాఖ మంత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ను వాపస్ తీసుకొంటే ట్రిబ్యునల్ వేస్తామని హామీ ఇచ్చారని.. ఈ మేరకు తెలంగాణ కేసు వెనక్కు తీసుకొన్నప్పటికీ ట్రిబ్యునల్ ఏర్పాటు ఇంకా పెండింగ్లోనే ఉన్నదని తెలిపారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుందనే విశ్వాసంతో ఇప్పటివరకు తాత్కాలిక ఒప్పందానికి తెలంగాణ అంగీకరిస్తూ వచ్చిందన్నారు.
2021-22లో తాత్కాలిక ఒప్పందం అమలుపై నిరసన వ్యక్తం చేస్తూనే అంగీకరించడానికి కారణం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కేటాయించిన దానికంటే 34 టీఎంసీలు మళ్లించకుండా చూడాలన్న షరతుతో మాత్రమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ విజ్ఞప్తిని బేఖాతరుచేసి 34 టీఎంసీలను అదనంగా తరలించుకొని పోతుంటే బోర్డు పట్టించుకోలేదన్నారు. ఈ విషయాన్ని బోర్డు ముందు ఎన్ని సార్లు లేవనెత్తినా పట్టించుకోలేదని చెప్పారు. ఈ ఏడాది మే ఆరో తేదీన జరిగిన బోర్డు మీటింగ్లోనే 2022-23 సంవత్సరానికి 50ః50 నిష్పత్తి ప్రకారం 105 టీఎంసీల జలాల పంపిణీ తెలంగాణకు జరుగాలని డిమాండ్ చేసిన విషయాన్ని రజత్ కుమార్ ప్రస్తావించారు. మూడు ఆపరేషనల్ ప్రాజెక్టులైన ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను దృష్టిలో ఉంచుకొని నీటి పంపిణీ జరగాలని కోరారు. కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసేంతవరకూ తాత్కాలిక ఒప్పందం అమలును అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. 2022-23లోనూ 66:34 నిష్పత్తిని కొనసాగిస్తామని కృష్ణాబోర్డు ఇచ్చిన నోటీసుపై రజత్కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేఆర్ఎంబీ నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ వేసి తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చేంతరవకూ 50ః50నిష్పత్తిలోనే నీటిని వాడుకుంటామని ఆ లేఖలో తేల్చిచెప్పారు. అదేవిధంగా పోలవరం ద్వారా 80 టీఎంసీలను మళ్లిస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎగువ వినియోగించుకోవాల్సిన 45 టీఎంసీలను వెంటనే తెలంగాణకు కేటాయించాలని, తాగునీటికి వినియోగిస్తున్న జలాలను 20 శాతంగానే పరిగణించాలని, అదేవిధంగా సాగర్లో క్యారీ ఓవర్కు అనుమతివ్వాలని ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని లేఖలో రజత్కుమార్ పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రం ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. భాగస్వాములను వెంటనే సమావేశపరిచి తెలంగాణ న్యాయపరమైన హక్కులకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకోవాలని లేఖలో రజత్కుమార్ కోరారు.
కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటయిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశం ఈనెల 16న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖను రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆపరేషన్స్, జలవిద్యుత్తు ఉత్పత్తికి తదితర అంశాలకు సంబంధించిన రూల్కర్వ్ను రూపొందించేందుకు ఈ కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం కాగా, తాజాగా మరోసారి 16వ తేదీన సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టులో సొరంగం పనుల నుంచి వస్తున్న మట్టి, వ్యర్థాలను కాంట్రాక్టర్ అక్రమంగా కృష్ణానదిలో పారబోస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు. ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లా కొత్తూరు, దోర్నాల మండలాల్లో సొరంగం పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ వెలికితీస్తున్న వేల టన్నుల మట్టి, ఇతర వ్యర్థాలను శ్రీశైలం జలాశయంలో పారబోస్తున్నట్టు ఆధారాలతో సహా పత్రికల్లో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. వ్యర్థాల పారబోతతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు నీరు కలుషితమై తాగు, సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ తక్షణం ఏపీ ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్తో చర్చించి వెంటనే వ్యర్థాల పారబోతను నిలిపివేసేలా చూడాలని ఆ లేఖలో కోరారు.