కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీలో ఏపీకి తేల్చిచెప్పిన తెలంగాణ
హైదరాబాద్, మార్చి10 : నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్గా నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ సీఈ మురళీనాథ్ పాల్గొన్నారు. నాగార్జునసాగర్ వద్ద నీటి వినియోగంపై చర్చించారు. కృష్ణా జలాల వాటాలో ప్రస్తుతం తెలంగాణకు 92 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీల కంటే తక్కువగా వినియోగించుకొనే అవకాశం ఉన్నది. ఏపీ ప్రభుత్వం 39 టీఎంసీలు కావాలని కోరింది. దీనిని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తిరస్కరించారు. ఏటా ఏపీ ఇదే రీతిన వ్యవహరిస్తున్నదని, తెలంగాణకు క్యారీ ఓవర్ నీళ్లను వాడుకొనేందుకు ఒప్పుకోవడం లేదని ఆక్షేపించారు. క్యారీ ఓవర్ ప్రతిపాదికన జలాల వినియోగానికి ఏపీ కచ్చితమైన హామీ ఇవ్వాలని, ఆ తరువాతే అదనపు జలాల వినియోగానికి అంగీకరిస్తామని ఈఎన్సీ మురళీధర్ తేల్చిచెప్పారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని ఏపీ అధికారి చెప్పడంతో సమావేశం అక్కడితో ముగిసింది.