Uttam Kumar Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేరళ రాష్ర్టానికి అవసరమైన బియ్యం అవసరాలను తీర్చగలమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే వరి ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తామని తెలిపారు. కేరళ, తెలంగాణ రాష్ర్టాల మధ్య పరస్పర ప్రయోజనకర సహకారం, అవకాశాలపై ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్అనిల్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేరళ రాష్ర్టానికి అవసరమైన కొన్నిరకాల వరిని తెలంగాణలో సాగు చేయడంపై మంత్రులిద్దరూ చర్చించారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న వివిధ అవకాశాలను చర్చించి ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒప్పందం కార్యరూపం దాలిస్తే ఉభయ రాష్ర్టాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. కేరళలో పండించే ఇతర ఆహార అవసరాలపైనా వారు చర్చించారు. సమావేశంలో కేరళ పౌరసరఫరాల కమిషనర్ డాక్టర్ సుజిత్బాబు, తెలంగాణ పౌర సరఫరాలశాఖ కమిషనర్ చౌహన్ పాల్గొన్నారు.