హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. తాజా బడ్జెట్లో అటవీశాఖకు రూ.1,471 కోట్లు కేటాయించడం సర్కారు ప్రాధాన్యాన్ని చెప్పినట్టయ్యింది. నిరుడితో పోల్చితే రూ.26 కోట్లు అదనంగా కేటాయించారు.
హరితహారం స్థాయిలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా మొక్కలు నాటడం లేదు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు తమ వార్షిక బడ్జెట్లో 10 శాతం గ్రీన్బడ్జెట్ కింద కేటాయించి, పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్న నిబంధనను నూతన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల్లో ప్రభుత్వం పొందుపరిచింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదిక-2021 ప్రకారం తెలంగాణలో మొత్తం గ్రీన్కవర్ 7.70 శాతం పెరిగిందని తెలిపింది.
ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో), ఆర్బన్ డే ఫౌండేషన్ హైదరాబాద్ నగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్’గా వరుసగా రెండుసార్లు గుర్తించింది. భారత్ నుంచి ఈ గుర్తింపు సాధించిన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. 2015లో తెలంగాణలో 19,854 చదరపు కిలోమీటర్ల అడవి ఉంటే, 2019 నాటికి 20,582 చదరపు కిలోమీటర్లకు, 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 2015-2021 మధ్య అటవీ విస్తీర్ణం 6.85 శాతం పెరిగింది. అందులో హైదరాబాద్ రికార్డు సృష్టించింది. దేశంలోని 7 మెగాసిటీల్లో హైదరాబాద్లో 146.8 శాతం (దశాబ్ద కాలంలో) అటవీ విస్తీర్ణం పెరిగింది.
హరితనిధితో పుష్కలంగా నిధులు
పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు, విద్యార్థులు, మొదలైన వారి నుంచి సేకరించిన విరాళాలతో హరితనిధికి నిధులు సమకూరుతున్నాయి. అడవుల పరిరక్షణకు సర్కారు తీసుకొంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో వన్యమృగాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతరించి పోతున్న అనేక పక్షిజాతులు తిరిగి ఊపిరి పోసుకొన్నాయి.
బడ్జెట్ కేటాయింపులు
వార్షిక సంవత్సరం : కేటాయింపు (కోట్లలో)
2021-22 : రూ.1,265.78
2022-23 : రూ.1,410.37
2023-24 : రూ.1,471