జగిత్యాల : దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం చేరుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నర్సయ్య పల్లెలో నిర్వహించిన రైతు దినోత్సవం( Farmers Day)లో మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని అక్కడి రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
రైతును రాజు చేయడమేప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కోసం ఎకరానికి 10 వేల ఆర్థిక సాయం ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మాత్రమేనని వెల్లడించారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా తెలంగాణ అభివృద్ధి సాధించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు మాత్రమే ఖర్చు చేసేవారని ఆరోపించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం 20 రేట్లు నిధులు అధికంగా వ్యవసాయంపై ఖర్చు చేస్తుందన్నారు. పట్టా భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకూ రైతు బంధు అమలు అవుతుందని మంత్రి గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి అభివృద్ధి కనిపించడం లేదా ?
తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి కనిపించడం లేదని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలతో తెలంగాణలో వ్యవసాయ రూపు రేఖలు పూర్తిగా మారాయని, ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే మూడు రేట్లు వరి విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులకు మంత్రి శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.