హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వ్యవసాయ మాడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ అగ్రిబిజినెస్ 5వ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయరంగం అద్భుతంగా పురోగమిస్తున్నదని చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ మాజీ మంత్రి, ఇక్రిశాట్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విలియం డీ ధర్ తదితరులు పాల్గొన్నారు.