Singareni | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిందని సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స్ఫూర్తితో రానున్న ఐదేళ్లలో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి.. తద్వారా రూ.50వేలకోట్ల టర్నోవర్కు ఎదగాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని, మాట్లాడారు. మొదట తెలంగాణ అమరవీరులు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలో సాధించిందని, అదేవిధంగా దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ గత తొమ్మిదేళ్లలో సాధించని వృద్ధిని సింగరేణి సంస్థ సాధించిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిరుద్యోగులకు ఇప్పటివరకు 19వేల ఉద్యోగాలను సంస్థ కల్పించిందన్నారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 43వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 45 శాతం ఉద్యోగులు యువకులేనని పేర్కొన్నారు.
దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉండగా సింగరేణి సంస్థ మాత్రం అభివృద్ధిలో ముందుకుపోతూ ఇతర రాష్ట్రాల్లోకి కూడా అడుగుపెడుతోందన్నారు.
సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బ్లాక్ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నదని, వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందన్నారు. సీఎం సూచన మేరకు సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇప్పటికే రూ.1200 మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిందని, 224 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కూడా రాష్ట్ర అవసరాలకు అందిస్తుందన్నారు. రానున్న కాలంలో సింగరేణి సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సింగరేణి సంస్థ వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తిని 100 మిలియన్ టన్నులకు పెంచడం కోసం 8 కొత్త గనులను ప్రారంభిస్తుందని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తగినన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సమష్టిగా కృషి చేస్తూ లక్షాలను సాధించాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంబురాలు సందర్భంగా ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించారు. ఎన్సీడబ్ల్యూఏ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ నాగమణి, సెక్యూరిటీ గార్డు ఉబయదుల్లా, అధికారుల విభాగంలో డీజీఎం చక్రధర్ రావు, ఎస్వోఎం కృష్ణాచారిలను సన్మానించారు. అలాగే సింగరేణి సంబురాల సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ, సింగరేణి ప్రగతికి దర్పణంగా రూపొందించిన అద్భుత ప్రగతి పుస్తకాన్ని, ప్రముఖ కవి, సింగరేణి ఉద్యోగి జయరాజు రాసిన గీతాన్ని సీఎండీ ఆవిష్కరించి, సత్కరించారు.