Talasani : రాష్ట్ర మాజీ మంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్లో చరిత్ర తిరగరాస్తామని అన్నారు.
అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి చేసిన BRS వెంటే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేస్తున్నామంటోందని అది అవాస్తవమని అన్నారు. ఐదు హామీలు అమలు చేస్తున్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నదని, ఇప్పటివరకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల పండుగలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారని అన్నారు. క్రిస్మస్, రంజాన్ పండుగలను నిర్వహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మొఖం పెట్టుకొని క్రిస్టియన్, ముస్లిం ఓట్లను అడుగుతుందని ప్రశ్నించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు అంటే ఒక బ్రాండ్ అని, ఆయన గెలుపు తథ్యమని, ఎవరూ ఆపలేరని తలసాని ధీమా వ్యక్తం చేశారు.