హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో చర్చించి విధివిధానాలను రూపొందించనున్నారు. ఇంగ్లిష్ మీడియం, ఫీజుల నియంత్రణ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీలో) చైర్పర్సన్ పీ సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యింది.
మంత్రులు కే తారకరామారావు, టీ హరీశ్రావు, టీ శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, గుంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఆంగ్ల మాధ్యమంలో చేరే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాఠ్య పుస్తకాలను ద్విభాష (బైలింగువల్)గా ముద్రించి అందించాలని సూచించింది. ఇంగ్లిష్లో బోధించేందుకు ఉపాధ్యయులకు కూడా ప్రత్యేక శిక్షణనివ్వాలని తెలిపింది. ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలను నేర్పేందుకు అవసరమైతే టీశాట్ ద్వారా ప్రత్యేక కోర్సులను నిర్వహించాలని ఆదేశించింది. మన ఊరు -మన బడి కార్యక్రమంలో డిజిటల్ క్లాస్రూంలను ఏర్పాటు చేస్తున్నందున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్తులో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశముందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం తల్లిదండ్రుల ఆశయాలను, ఆకాంక్షలను సాకారంచేసే నిర్ణయంగా భావించాలని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్నది.
ఫీజులపై మరోమారు భేటీ
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతస్థాయిలో చర్చించింది. దీనిపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంటర్ విద్యా కమిషన్కు చెందిన సయ్యద్ ఉమర్ జలీల్, క్రిస్టినా చోంగ్తు, దివ్యదేవరాజన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమగ్రంగా చర్చించాం: మంత్రి
మంత్రి సబితాఇంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ, ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంపై ఉపసంఘం భేటీలో సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఫీజుల నియంత్రణ చట్టంపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసులు, ఇతర రాష్ర్టాల్లో అమలుచేస్తున్న ఫీజు నియంత్రణ చట్టాలను పరిశీలించామని తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన మన ఊరు -మన బడి కార్యక్రమానికి ఈ నెల 8న సీఎం కేసీఆర్ వనపర్తిలో శ్రీకారం చుట్టనున్నారని, మూడేండ్లలో మూడు విడుతల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని చెప్పారు.