సూర్యాపేట: స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపాధ్యాయులపాత్ర గణనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.. రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయుడి పేరుతో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమైందన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం విద్య అందుబాటులో ఉండక పోవడం, ప్రజల మధ్య అంతరాలు సృష్టించడం వంటి పరిణామాల నేపథ్యంలో చిన్నచిన్న దేశాలు కూడా భారత్పై దండయాత్ర చేశాయన్నారు. విద్య లేమితోనే దేశం పరాయి పాలకుల వశమైందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో ఉపాధ్యాయులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా స్వాతంత్ర్య సంగ్రామంలో వారు పోషించిన పాత్ర శ్లాఘనీయమైందని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకు విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారిలో సృజనాత్మకను వెలుగులోకి తెవడంతోనే దేశం అద్భుత పురోగతి సాధిస్తున్నదని చెప్పారు.