Teachers | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. కానీ, ఎవరూ సరిగా విధులు నిర్వర్తించడంలేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరముంది. అన్నిప్రభుత్వశాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేస్తాం. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోండి’ ఎంసీఆర్హెచ్చార్డీలో గతంలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి.‘విద్యాశాఖపై నాకు పూర్తి అవగాహన ఉన్నది. మా బంధువుల్లో టీచర్లున్నారు.
ఎంతమంది బడికెళ్తున్నారో.. ఎంత మంది వెళ్లడం లేదో నాకు తెలుసు.’ – ఇటీవల తనను కలిసిన ఉపాధ్యాయ సంఘం నేతలతో సీఎం రేవంత్రెడ్డి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎఫ్ఆర్ఎస్ను అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ సన్నాహాలు చేస్తుండగా, ఈ విధానాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘నమ్మి ఓట్లేస్తే ఇంత మోసం చేస్తారా.. మా పైనే నిఘా పెడుతారా..?’ అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నాయి.
గతంలో కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ జియో అటెండెన్స్ అమలు చేసింది. నిజామాబాద్ జిల్లా అంతటా పైలట్ పద్ధతిలో అమలైంది. తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో విస్తరించగా అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఉపాధ్యాయ సంఘాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి. తాజాగా ఎఫ్ఆర్ఎస్ను కూడా కొన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘పెండింగ్ డీఏలు చెల్లించకుండా, ఈ-కుబేర్లోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకుండా ఇలా మాపై పెత్తనం ఏమిటి?’ అని నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయ సంఘం నేత విస్మయం వ్యక్తంచేశారు.
‘స్కూల్ టీచర్లను బడి దొంగలుగా చూడటం తగదు.. కొందరిని సాకుగా చూపి అందర్నీ బద్నాం చేయడం సరికాదు’ అని మరో ఉపాధ్యాయ సంఘం నేత హితవు పలికారు. ‘యాప్లో అటెండెన్స్ నమోదు కాకుంటే జీతం, అలవెన్సులు కట్ అయ్యి సస్పెండయ్యే అవకాశాలుంటాయి. ఇది మమ్మల్ని మానసిక ఆందోళనకు గురిచేసే ప్రమాదముంది’ అని మరో ఉపాధ్యాయ సంఘం నేత ఆందోళన వ్యక్తంచేశారు. ‘సాంకేతిక సమస్యలు, సిగ్నల్ లోపముంటే ఎలా అమలుచేస్తారు?’ మరో సంఘం నేత ప్రశ్నించారు. ‘విద్యారంగానికి నిధులు కేటాయించకుండా, బడుల్లో వసతులు కల్పించకుండా ఇలా చేయడం వల్ల ప్రయోజనముండదు’ అని అభిప్రాయపడ్డారు.
అంధులకు మినహాయింపునివ్వండి: బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
ఎఫ్ఆర్ఎస్ నుంచి తమకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం ఇచ్చారు.