కరీంనగర్ : ప్రభుత్వ పథకాలను పరిగెలతో పోల్చిన ఈటల రాజేందర్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజూరాబాద్ నియోజకవవర్గానికి చెందిన సీపీఐ, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు, పలువురు యువకులు, హమాలి నాయకులు, మైనారిటీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం సిటీ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు.
రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో మిల్లర్లు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ హామీనిచ్చారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం యాసంగి సీజన్లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థే సేకరించినట్లు తెలిపారు. ఈ రికార్డులో రైస్ మిల్లర్ల భాగస్వామ్యం మరవలేనిదన్నారు. ఈ ధాన్యాన్ని నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేయడంలో సహకరిస్తున్న రైస్ మిల్లర్లకు అభినందనలు తెలిపారు. రైస్ మిల్లర్లందరూ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని, గెలుపులో కీలక భాగస్వామ్యం వహించాలని విజ్ణప్తి చేశారు.
కేసీఆర్ను ఎదురిస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుందనే దురాశతో ఈటెల రాజేందర్ చేసిన కుట్రలు నీచమైనవన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దిని గాలికొదిలేసి స్వలాభం కోసం రాజకీయాల్ని వాడుకోవడం హేయమైన చర్య అన్నారు. ఈటల హయాంలో హుజురాబాద్ అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేయబడిందన్నారు. ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయని ఆవేదన చెందారు. ఈ దురవస్థ తొలిగిపోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని హుజురాబాద్ను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపు నిచ్చారు.
రికార్డు స్థాయి ధాన్యం మిల్లింగ్ అవకాశం కల్పించి అండగా ఉన్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తామని రైస్ మిల్లర్లు తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి గెలిచినట్టని, సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని, రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రైస్ మిల్లర్లు సంపూర్ణంగా టీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని వెల్లడించారు.