హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయంపై పన్ను విధించే ఆలోచన అసంబద్ధమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు చెప్పారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ ఒక ఇంగ్లిషు పత్రికలో రాసిన వ్యాసంపై సోమవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రైతుల ఆదాయంపై పన్ను విధించే ముందు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ వాగ్దానం ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ హామీపై ప్రధానమంత్రి కార్యాలయం లేదా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ కానీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సుభాష్ చంద్రబోస్కు నివాళి…
భరతమాత కన్న ధైర్యవంతులైన బిడ్డల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరని కేటీఆర్ కొనియాడారు. బోస్ 126వ జయంతి సందర్భంగా ఆయనకు సోమవారం ట్విట్టర్లో నివాళులు అర్పించారు.