Chain Snatchers | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్ స్నాచర్ల నుంచి 10 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, రూ. 25 వేల నగదు, 20 డాలర్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గత పదిహేను రోజుల నుంచి అమీన్పూర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా ఉంచి వారిని సోమవారం పట్టుకున్నారు.
నిందితులను అమరాజ్ కుమార్ రెడ్డి అలియాస్ మున్నిత్తం అమరాజ్ కుమార్ అలియాస్ డాల్(24), తిప్పనబోయిన సాయి కృష్ణ అలియాస్ సాయిగా పోలీసులు గుర్తించారు. అమరాజ్ది రామాంతపూర్ కాగా, సాయిది చాంద్రాయణగుట్ట అని తెలిపారు. గత 12 ఏండ్ల నుంచి వీరిద్దరూ స్నేహితులు. గంజాయి, మద్యానికి బానిసగా మారారు. దీంతో డబ్బు కోసం ఇండ్లలో దొంగతనాలకు పాల్పడటం, చైన్ స్నాచింగ్ చేయడం ప్రారంభించారు. వీరిద్దరిపై హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో 40కి పైగా కేసులు నమోదు అయ్యాయి. జైలుకు కూడా వెళ్లొచ్చారు.