Nalgonda | త్రిపురారం/చిట్యాల/రామన్నపేట, మార్చి 3 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టిస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోనూ సాగునీటికి కష్టంగా మారింది.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన నగిరి శ్రీనివాస్ తనకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. బావి, బోరు ఉన్నా నీళ్లు సరిపోక నెల క్రితం పొలంలో మరో బోరు వేశాడు. రెండు బోర్లు, బావి ఉన్నా నీళ్లు అందక ఎకరం పొలం ఎండిపోతున్నది. ఈ క్రమంలో బెజ్జికల్ గ్రామానికి చెందిన రైతుకు రూ.2 వేలు చెల్లించి ఆదివారం ట్యాంకర్ నీటిని తెప్పించి పొలానికి పోయించాడు.
10 గుంటల మడికి ఐదు ట్యాంకర్ల నీరు పట్టాయని, అందుకు రూ.10 వేలు చెల్లించినట్టు రైతు శ్రీనివాస్ తెలిపాడు. ఎకరం పొలం తడవాలంటే దాదాపు 15 ట్యాంకర్ల నీరు అవసరమని ఆయన పేర్కొన్నాడు. అదీకాక ఉదయం నుంచి సాయంత్రం వరకు నడి ఎండలో కాపుకాసుకుంటూ పొలంలో ఉండాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో మొదటి సారిగా ట్యాంకర్ ద్వారా తానే నీటిని పోయించాని తెలిపాడు. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి సాగర్ ఎడమ కాల్వకు నీళ్లందించాలని కోరుతున్నాడు.
నిమ్మ తోటకూ ట్యాంకర్ నీరే..
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రైతు గంట్ల రవీందర్రెడ్డి తన ఎకరంన్నర నిమ్మతోట నీళ్లు లేక ఎండిపోయే దశకు వచ్చింది. దాంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు పెట్టి తోటను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికోసం వారానికి రూ. 6,600 ఖర్చు చేస్తున్నట్టు రైతు తెలిపాడు. అదే రైతు 7 ఎకరాల్లో వరి వేయగా నీటి కొరత కారణంగా 3 ఎకరాలకు మాత్రమే నీరందుతుందని, మిగిలిన 4 ఎకరాలు ఎండి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
రామన్నపేట మండలంలోనూ..
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫ్నెహర్ కాల్వ ద్వారా నీళ్లు రాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు, బావులు నీళ్లు పోయడం లేదు. దాంతో రైతులు పొట్ట దశకు వచ్చిన వరి పొలాలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు రైతులు పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి తడుపుతున్నారు.
ఆదివారం రామన్నపేట మండలం బోగారంలో రైతు ధనుంజయ రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేయగా నీళ్లు లేక పొలం ఎండిపోయే దశకు వచ్చింది. దాంతో పంటను కాపాడుకోవడానికి 20 రోజులుగా ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. రోజుకు రూ.2,500 ట్యాంకర్కే ఖర్చు చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు.