Tamilisai |హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గవర్నర్గా తనకు ఎంతో చేయాలని ఉంటుందని, కానీ కొన్ని పరిమితులు ఉంటాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా తమిళిసై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనకూ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరంలేదని, బిల్లులు ఇతర విషయాలపై అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. బిల్లులను తానేమీ ఉద్దేశపూర్వకంగా ఆపడంలేదని పేర్కొన్నారు. కొన్ని బిల్లుల విషయంలో క్లారిఫికేషన్ అడిగానని, అవి వచ్చిన తర్వాత ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. తనది మోసం చేసే తత్వం కాదని, సవాళ్లకు, పంతాలకు తాను భయపడబోనని పేర్కొన్నారు.. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ, అభిమానాన్ని చూపించారంటూ ధన్యవాదాలు తెలియజేశారు. కొవిడ్ సమయంలో రాష్ట్రం సమర్థంగా వ్యవహరించిందని కొనియాడారు.
ఆర్టీసీ బిల్లుపై న్యాయశాఖ నుంచి గురువారం సమాధానం వచ్చిందని, ప్రొసీజర్ ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజ్భవన్కు, ప్రగతిభవన్కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పేర్కొన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించి క్యాటగిరిపై స్పష్టత లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. తాను నాలుగేండ్లుగా సీఎం కేసీఆర్ పాలనను చూస్తున్నానని, ఆయన సీనియర్ లీడర్, పవర్ఫుల్ లీడర్ అని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి జరుగుతున్న చర్చపై స్పందిస్తూ.. ఎవరి సంప్రదాయాలు వారికి ఉంటాయని, ఒక మతాన్నో, కులాన్నో చులకనగా చూడొద్దని అన్నారు. దేశంలో జమిలి ఎన్నికులుండాలన్నదే తన అభిప్రాయమని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయాల్లో మజిల్ పవర్, మనీ పవర్ను పట్టించుకోనని పేర్కొన్నారు.