Talasani Srinivas Yadav | హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు అని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల పీవీ నర్సింహా రావుకు భారతరత్న ప్రకటించిన సందర్భంగా శనివారం బేగంపేటలోని పీవీ నర్సింహారావు భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పీవీ నర్సింహా రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీవీ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికే గర్వకారణం అన్నారు. పీవీ నర్సింహా రావుకు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన గౌరవం భారతరత్న అని పేర్కొన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎంతో విశేషమైన సేవలు అందించారని గుర్తుచేశారు. ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత కూడా పీవీకే దక్కుతుందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు అందుకున్నారని తెలిపారు.
దేశ ప్రధానమంత్రిగా పని చేసిన ఏకైక తెలుగు వ్యక్తి కూడా పీవీ నర్సింహా రావు అన్నారు. దేశంలో 17 భాషలు మాట్లాడ గలిగే ఒకే ఒక్కరు పీవీ అన్నారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. తన పరిపాలన దక్షతతో ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పారని, అలాంటి మహనీయుడికి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము అనేక సార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా నర్సింహా రావు శతజయంతిని సంవత్సరం పాటు ఎంతో గొప్పగా నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా తెలిపారు. మరణించిన తర్వాత కూడా ప్రజల మనసుల్లో కొందరు మాత్రమే నిలిచిపోతారని, అందులో పీవీ నర్సింహారావు ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, కార్పొరేటర్ టి.మహేశ్వరి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, శేఖర్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.