Nagarjuna Sagar | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్ను ఏపీ ప్రభు త్వం ఆక్రమించడం, దౌర్జన్యంగా నీటిని మళ్లించుకోవడం వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటన సాకుతో ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల హడావుడిలో నిమగ్నమైన తరుణాన్ని అదునుగా తీసుకుని, ఏపీని ఎగదోసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం ఆది నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ జలహక్కులను కాలరాస్తూ, ఏపీకి వత్తాసు పలికేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది. సెక్షన్ 87ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజి ట్ నోటిఫికేషన్ను జారీచేయాల్సి ఉన్నది. అప్పుడే కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ర్టాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతోపాటు విద్యుత్తు ఉత్పత్తి వంటి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతాయి.
అయితే ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేయకుండా, ఆపరేషన్ ప్రొటోకాల్ను రూపొందించకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ పట్టుబడుతూ వస్తున్నది. దీంతో కేంద్రం గెజిట్ను జారీచేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ, పలుమార్లు ఏపీ లేఖలు రాయడంతో కేంద్రం కనీసం తెలంగాణతో సంప్రదింపులు జరపకుండానే ఆగమేఘాల మీద 2021 జూన్15న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ను విడుదల చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నియంత్ర ణ, పరిపాలన విధివిధానాలకు సంబంధించి మార్గదర్శకాలను అందులో పేర్కొన్నది.
కొలిక్కిరాని ఆపరేషన్ ప్రొటోకాల్
గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జలసంఘం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి ప్రొటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్ను రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్ఎంబీ గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)ని ఏర్పాటు చేసింది. కమిటీలో కేఆర్ఎంబీ మెంబర్ (పవర్), ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు, టీఎస్జెన్కో హైడల్ పవర్, ఏపీ జెన్కో హైడల్ పవర్ చీఫ్ ఇంజినీర్లు మొత్తం 6 మంది సభ్యు లున్నారు.
సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది. అయితే డ్రాఫ్ట్లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మాటికీ జలవిద్యుత్తు ప్రాజెక్టేనని వాదించింది. విద్యుత్తు ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరదజలాల మళ్లింపు తదితర అంశాలపై సీడబ్ల్యూసీ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. ఆర్ఎంసీ ప్రతిపాదనలను తప్పుబట్టింది. కానీ, ఆర్ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్లోనే ఉండిపోయింది.
కృష్ణా బోర్డు పరిధిలో 10 ప్రాజెక్టులు
కేఆర్ఎంబీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం గతంలోనే బోర్డు పరిధికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. కేఆర్ఎంబీ పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టులుంటే, ఇందులో తెలంగాణలోనివే 21 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీకి చెందినవి 15 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఇక 8ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి.
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు జూరాల, ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజీ, నాగార్జునసాగర్ టెయిల్పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్, లోలెవల్ కెనాల్స్, కృష్ణా నదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్లో, వివిధ ఔట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే ఔట్ఫ్లోను బోర్డే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, దానికి అవసరమైన నీటి లెక్కల ఇండెంట్ను సీజన్లవారీగా బోర్డులకు రాష్ర్టాలు సమర్పించాలని, ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటనెన్స్కు నిధులు రాష్ర్టాలే చెల్లించాలని, టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులనూ సమకూర్చాలని ఆ డ్రాఫ్ట్లో స్పష్టం చేసింది.
ప్రాజెక్టులతోపాటు వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, చెరువులు కూడా ఈ బోర్డుల పరిధిలోకి తీసుకోవడం గమనార్హం. దీంతో తెలంగాణలో సాగునీటి వసతి మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్లిపోనున్నది. జ్యురిస్డిక్షన్ వస్తే బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లు, ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, అటెండర్లు కలిపి కృష్ణా బోర్డుకు 328 మంది అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో 90 శాతానికిపైగా స్టాఫ్ను రెండు రాష్ర్టాలే సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు ప్రస్తుతం ఏడాదికి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుండగా, జ్యురిస్డిక్షన్ నోటిఫై చేశాక ఇంజినీర్టు, సెక్యూరిటీ స్టాఫ్తో కలుపుకుంటే నిర్వహణ వ్యయం రూ.100 కోట్లకు చేరే అవకాశమున్నది. అదేవిధంగా ఆయా ప్రాజెక్టుల భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి.
రేపు ఇరు రాష్ర్టాలతో కేంద్రజల్శక్తిశాఖ భేటీ
సాగర్ డ్యామ్ ఆక్రమణ నేపథ్యంలో వివా దం పరిష్కారానికి కేంద్ర జల్శక్తిశాఖ రేపు (బుధవారం) మరోసారి ఇరు రాష్ర్టాలతో భేటీ కానున్నది. ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ తరువాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. దీంతో 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిషారం, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకషంగా చర్చిస్తామని వెల్లడించింది.
ఏపీని ఎగదోసి?
నీటి పంపకాలు పూర్తికాకుండా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ మొదటి నుంచీ ససేమిరా అంటున్నది. ఏపీ మాత్రం మొదటి నుంచీ అందుకోసం పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరూ ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యామ్ను ఆక్రమించింది. దీనివెనక కేంద్రమే పావులు కదిపిందని ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఇదే అదునుగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నదని అంటున్నారు. ‘నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. అలాంటప్పుడు బోర్డులు ఎలా పర్యవేక్షిస్తాయి. ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి, ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తాయి? ప్రధానమైన అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం సరికాదు’ అని తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతున్నది.
సాగర్ నుంచి 5టీఎంసీలు ఇవ్వండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రతిపాదన
నాగార్జునసాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ సర్కారు కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయపురేకు ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి ప్రతిపాదనలు పంపించారు. డ్యామ్ను దురాక్రమించి, కుడికాలువ ద్వారా నీళ్లను దౌర్జన్యంగా తరలించుకుపోయిన ఉదంతంపై తెలంగాణ ఫిర్యాదుతో కేంద్రజలశక్తిశాఖ జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ను ఆదేశించారు. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరుకాలేదు. దీంతో తెలంగాణ అభిప్రాయం తీసుకున్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీకి కేఆర్ఎంబీ తెలిపినట్టు సమాచారం.