హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ పథకం కింద దళితులకు రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని మర్చిపోయారా? అని నిలదీశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీలకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులన్నీ ఖర్చు చేస్తామని హామీ ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు. దీనిపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. 5-10% వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. దీంతో బడ్జెట్ను పూర్తిగా అమలుచేయలేమని ఆర్థికమంత్రే ఒప్పుకొన్నారని కడియం వ్యాఖ్యానించారు.
ఉద్యోగాల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ఇచ్చినట్టు చెప్పుకోవడం బాగాలేదని కడియం చురకలేశారు. గత రెండు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే గత ప్రభుత్వం చేసిన నియామకాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని, జాబ్ క్యాలండర్ను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో కేటాయించిన రూ.53 వేల కోట్లతో ఆరు గ్యారెంటీల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇందులో ఏ పథకానికి ఎంత కేటాయించారో చెప్పలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూ.23 వేల కోట్లు అవసరం కాగా రూ.7వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీంతో పథకాన్ని ఏవిధంగా అమలుచేస్తారని నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాదని, ఫ్రస్టేషన్ పార్టీ అంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓపిక లేకుండా పోతున్నదని, నోటికొచ్చింది మాట్లాడుతున్నారని కడియం మండిపడ్డారు. వాళ్ల తీరు చూస్తుంటే ఫ్రస్టేషన్లో ఎవరు ఉన్నారో ప్రజలకు అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆవేశంపై స్పందించిన కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డికి ఒక సూచన చేశారు. సీఎం రేవంత్, తాను ఒకే కాంపౌండ్ విద్యార్థులమని (టీడీపీ), ఆయన సీఎంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. తమ(బీఆర్ఎస్) నుంచి ఎలాంటి ప్రమాదం ఉండబోదని, మీ వాళ్లతో(కాంగ్రెస్) జాగ్రత్తగా ఉండాలని సూచించారు.