కేసముద్రం/నడికూడ, ఏప్రిల్ 20: గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆర్డీవో కొమురయ్యతో కలిసి రైల్వే 3వ లైన్ నిర్మాణ పనుల కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొని కేసముద్రంలోని ఇంటికి వెళ్తుండగా ఛాతీలో నొప్పి వస్తున్నదని సిబ్బందికి తెలుపగా.. ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్కు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకుండాపోయింది.
మృతదేహాన్ని హనుమకొండలోని ఆయన స్వగృహానికి తరలించారు. తహసీల్దార్ హఠాన్మరణంతో మం త్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే శంకర్నాయక్, కలెక్టర్ శశాంక సంతాపం తెలిపారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న తౌటం సదానందం(53) గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని తన నివాసంలో బుధవారం అర్ధరాత్రి వాంతులు కావడంతో టాబ్లెట్ల కోసం మందుల షాపునకు వెళ్లగా.. గుండెపోటు వ చ్చి అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కమలాపూరానికి తీసుకెళ్లారు. ఇతర ఉపాధ్యాయులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.