యాదాద్రి, సెప్టెంబర్ 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి స్వ యంభూ దివ్యక్షేత్రంతోపాటు అనుబంధ పూర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గురువారం స్వాతి నక్షత్ర పూజలను అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహించారు. ముం దుగా 108 వెండి కలశాలకు పూజలు చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు జరిపారు. ఉదయం నుంచి సాయం త్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారి ఖజానాకు రూ.31,99,033 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.