హైదరాబాద్ : కేంద్ర సహకరించకపోయినా, నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు -2023 విజేతలకు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన ఈ 40 గ్రామాలు దేశ స్థాయిలో కూడా అవార్డులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు.
నేడు రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా వెంటనే అంద చేయాలని ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నది. నిధులు నిలిపివేసి వేడుక చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయా అంశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు సూచించిన కేంద్రం రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయనిరాకరణ చేస్తున్నదన్నారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. భవిష్యత్లో తెలంగాణ పల్లెలు మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ సీఈవో గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్పీఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, యూనిసెఫ్ డైరెక్టర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.