యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి ప్రధానాలయ ముఖ మండపంలో శనివారం పుష్పార్చనలు అత్యంత వైభవంగా సాగాయి. మన్యుసూక్త పారాయణం గావించి బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా జరిగిన సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారి ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం స్థాన సుప్రభాతాన్ని ఆలకించి స్వామివారిని మేల్కొలిపారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన జరిపి బాలభోగం నివేదన చేపట్టారు.
నిత్యబలి ప్రదానం మంగళాశాసనంతో ప్రాబోదిక కార్యక్రమానికి ముగింపు పలికి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామివారికి నిత్య సుదర్శన నారసింహ హవనం జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం సాగింది. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ, నిత్య తిరుకల్యాణోత్సవం పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిపించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధిసేవ, దర్భార్సేవ నిర్వహించారు. దర్శనాల అనంతరం రాత్రి స్వామివారికి నివేదన చేపట్టిన అర్చకులు.. శయనోత్సవ సేవను నిర్వహించి ఆలయానికి ద్వార బంధనం గావించారు. ఆలయంలో భక్తుల సందడి కొనసాగింది. 20వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.42,43,101 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.