హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్టు ఐజీ ఎవీ రంగనాథ్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో మల్టీజోన్1 పరిధికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ప్రజా భవన్ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్ సీపీ విచారణలో నిజ నిర్ధారణ కావడంతో బోధన్ ఇన్స్పెక్టర్ బీడీ ప్రేమ్ కుమార్ను సస్పెండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం రమేశ్ మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్టు నిర్ధారణ కావడంతో అతనిని సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిర్లక్ష్యం వహించిన ఎస్సైలు జీ మనోహర్ రావు, ఎ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బీ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టీ నరేందర్లు సస్పెండ్కు గురయ్యారు. గత ఏడాది సారంగాపూర్ పోలీసులు 70 కిలోల గంజాయిని వాహనంతో సహా పట్టుకొని పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. కాగా, స్టేషన్ నుంచి గంజాయిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం తెలిసిందే.