DSC Results | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేయగా, 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి. అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు. వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ పరిశీలనకు పంపించారు. దీంతో కథ మొదటికొచ్చింది. డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్ మార్కుల అప్లోడింగ్, సవరణకు విద్యాశాఖ అవకాశమివ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగుచూశాయి. సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాతవే ప్రత్యక్ష్యమయ్యా యి. ఒక సబ్జెక్టుకు పరీక్షరాస్తే మరో సబ్జెక్టు వెబ్సైట్లో చూపించింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది. అయితే దీనిపై ముందుకెళ్లాలా..లేక ఇప్పటికే ప్రకటించిన తుది ‘కీ’ ప్రకారమే నడుచుకోవాలా..? అన్న విషయంలో విద్యాశాఖ ఏదీ తేల్చుకోలేకపోతున్నది. దీంతోనే ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది.
ఆందోళనలో లక్షలాది అభ్యర్థులు
డీఎస్సీ ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. ఫైనల్ ‘కీ’ విడుదల చేసి 20 రోజులుదాటినా ఇంతవర కు ఫలితాలు విడుదల చేయకపోవడం ఆందోళనకరం. ఫైనల్ ‘కీ’ తప్పులపై క్లా రిటీ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే జీఆర్ఎల్ను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ను పూర్తిచేయాలి.
– రావుల రామ్మోహన్రెడ్డి, డీఎల్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు