హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘పోలవరం’ ముంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికను ఇవ్వడంపై తెలంగాణ సర్కార్ మండిపడింది. ముంపు ప్రభావంపై సర్వే చేపట్టకుండానే సమస్య పరిష్కారమైందని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకనైనా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ డిమాండ్ చేయడం, ఏపీ వ్యతిరేకించడం, దీంతో ఆయా రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీంతో అన్ని రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)ని కోర్టు ఆదేశించింది.
కేంద్ర జల్శక్తి శాఖ బాధిత రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలను, డిమాండ్లను తెలుసుకున్నది. ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు ప్రమాదం పొంచి ఉందని, నిరుడు భద్రాచలం వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వరద వచ్చిందని నొక్కిచెప్పింది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను, ముంపు చిత్రపటాలను కూడా అందజేసింది. తెలంగాణ వాదనలతో సీడబ్ల్యూసీ అంగీకారం తెలపడంతోపాటు, వెంటనే జాయింట్ సర్వే చేయాలని పీపీఏకు, ఏపీకి స్పష్టమైన అదేశాలు సైతం జారీ చేసింది. కానీ ఇప్పటికీ అటు పీపీఏ కానీ, ఇటు ఏపీకానీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై ఇటీవలనే కేంద్రం సుప్రీంకోర్టుకు రిపోర్టును అందజేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాలు దాదాపు కొలిక్కివచ్చాయని నివేదించింది.