న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. ప్రాజెక్టు నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని, ప్రజలు తాగునీటి ఎద్దడికి గురికావద్దని వ్యాఖ్యానించింది.
ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా పర్యావరణ అనుమతులు లేవంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.500 కోట్ల జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై కోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఆగస్టు నెలకు వాయిదా వేసింది.