మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలి
పనుల పురోగతిపై సమీక్షలో మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, హెల్త్, అర్అండ్బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం కొత్తగా మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మిస్తున్న 8 మెడికల్ కాలేజీల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటికే 4 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయని, వీటి నిర్మాణాలు కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని, ఎన్ఎంసీ నిబంధనల మేరకు, ఆధునిక పద్ధతుల్లో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొంటూ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. పురోగతిని రోజువారీగా సమీక్షించాలని, భవన నిర్మాణ పనులు పూర్తయిన చోట మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన వసతులు కల్పించాలని స్పష్టంచేశారు. పనుల్లో వేగాన్ని పెంచేందుకు ప్రతి కాలేజీకి ఒక ఇంజనీరింగ్ అధికారిని ఏర్పాటు చేయాలని టీఎస్ఐఐసీ, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఈఎన్సీ గణపతిరెడ్డి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.