భువనగిరి : శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ(KRMB)కి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, ఛలో నల్లగొండ భువనగిరి కోర్డినేటర్ సుంకె రవిశంకర్(Sunke Ravi Shankar) చెప్పారు. గురువారం భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భువనగిరి నియోజకవర్గం ముఖ్య నేతలతో చలో నల్లగొండ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిట్టా బాలకృష్ణ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు తదితరులతో కలిసి ఛలో నల్లగొండ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించటం వల్ల ఎడమ కాల్వ రైతాంగం మళ్లీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చిందని వాపోయారు.
సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతికి పోయాయని, మనల్ని అడుగు కూడా పెట్టనియ్యడం లేదని, ఇది కాంగ్రెస్ వాళ్లు చేసిన నిర్వాకమని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై కేంద్రం పెతనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పదేళ్లుగా ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చారని, అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని రెండు నెలలు గడవకు ముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏదో ఆశించే కాంగ్రెస్ ప్రాజెక్టులను అప్ప జెప్పుతున్నాదని ఆరోపించారు. ఛలో నల్లగొండ సభకు భువనగిరి నియోజకవర్గం నుంచి 20 వేల మంది పైగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లనున్నట్టు తెలిపారు. ఛలో నల్గొండ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.