Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులా? 50 రోజుల వేసవి సెలవుల్లో ఫ్యామిలీస్తో ఎంచక్కా టూర్కో.. హాలిడే ట్రిప్కో వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా? అయితే మీ ప్రణాళికలను వెంటనే రద్దు చేసుకోండి. ప్లాన్లో ఉంటే ఆపేసుకోండి. ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో ప్రభుత్వం మీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రంలో ని ఉపాధ్యాయులందరికీ మేనెలలో ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారమే ఆదేశాలను జారీచేశారు. ఈ మేరకు శిక్షణ దృష్ట్యా ఉపాధ్యాయులు ఎవరూ అనుమతి లేకుండా హెడ్క్వార్టర్ విడిచి వెళ్లవద్దని, సెలవులు మంజూరు చేయబోమని వివిధ జిల్లాల డీఈవోలు మండలాలకు ఆదేశాలను జారీచేశారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి.
న్యాస్, అసర్ సర్వేల్లో, పీజీఐ ఇండెక్స్ సహా ఏది తీసుకున్నా ప్రాథమిక, ఉన్నత అన్న తేడాల్లేకుండా విద్యార్థులు వెనుకంజలో ఉన్నారు. కొందరు విద్యార్థులు కనీసం చదవలేని, రాయలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తొలుత ఉపాధ్యాయులను చక్కదిద్దాల్సి ఉన్నది. బోధనను మెరుగుపరచాల్సి ఉన్నది. ఇప్పటికే వివిధ రాష్ర్టాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఢిల్లీలో సరికొత్త బోధనా మెళకువలను అనుసరిస్తున్నారు. కేరళలో డిజిటల్ విద్యపై టీచర్లకు శిక్షణనిచ్చారు. మహారాష్ట్రలో పాఠశాల స్థాయిలో ప్రమాణాలను అంచనాలు వేస్తున్నారు. ఇదే రీతిలో రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు కూడా వివిధ సబ్జెక్టుల్లో బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చేందుకు తొలుత ఆర్సీ (రిసోర్స్పర్సన్)లను ఎంపికచేస్తారు. ఈనెల 30లోగా మండలం, జిల్లా పరిధిలో రిసోర్స్పర్సన్ల ఎంపికను పూర్తిచేస్తారు. ఈ ఎంపిక బాధ్యతలను జిల్లా కలెక్టర్, డీఈవో, డైట్, బీఈడీ, యూనివర్సిటీ అధ్యాపకులతో కూడిన కమిటీకి అప్పగించారు. డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఆర్పీలను ఎంపికచేస్తారు. ప్రతి మండలం నుంచి ప్రతి సబ్జెక్టులో ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను రిసోర్స్పర్సన్స్గా ఎంపికచేస్తారు. జిల్లా పరిధిలో సబ్జెక్టుకు 2-4 వరకు స్కూల్ అసిస్టెంట్లను రిసోర్స్ పర్సన్లుగా అవకాశం కల్పిస్తారు. ఈ ఎంపిక తర్వాత మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.