మహబూబ్నగర్ : రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్లాలోని మహబూబ్నగర్ రూరల్ మండలం సూగూరు గడ్డ- మన్నెంకొండ స్టేషన్ల మధ్య రైల్వే అండర్ పాస్లో ప్రైవేటు స్కూలు బస్సు చిక్కుకున్న ఘటనపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ రైల్వేను దశలవారీగా ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునే క్రమంలోనే ఇప్పటికే అన్నిచోట్ల లెవెల్ క్రాసింగ్ లను తొలగిస్తూ అండర్ పాస్ లను నిర్మిస్తుందని విమర్శించారు.
నిర్మాణ లోపాలు సరైన డ్రైనేజీ విధానం ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షాకాలంలో అండర్ పాస్లు మడుగులను తలపిస్తున్నాయని.. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షపు నీటిలో స్కూల్ బస్సు చిక్కుకుపోయిన ఘటనలో మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడేలా చేసిన స్థానికులను ఆయన అభినందించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే చీఫ్ ఇంజినీర్తో మాట్లాడి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి అండర్ పాస్ను పరిశీలించి నిర్మాణ లోపాలు సవరించి డ్రైనేజీ సిస్టం సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. అండర్ పాస్ వద్ద గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.