యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేపట్టారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవ సేవ, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు.
సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చివాహనంపై వేంచేపు చేశారు. పశ్చిమతల రాజగోపురం గుండా తిరుమాఢవీధుల్లో సేవ ఊరేగించారు. ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి సేవను ప్రవేశింపజేశారు. దర్బార్ సేవలో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి వేంచేపు చేసి పారాయణం జరిపించారు.
ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు వైభవంగా జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి నిత్యాదాయం రూ.16,83,289 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.