హైదరాబాద్/ సిద్దిపేట మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే ఏటా రెండుసార్లు వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పదిరోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో 25 ఎకరాల విస్తీర్ణంలో రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూ చించారు.
ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా పంటలబీమాకు కొత్త విధానాన్ని రూపొందించాలన్నారు. రైతులకు అధిక ఆదాయం వచ్చే విధానాలను అన్వేషించాలని, అవసరమైతే చైనా, ఇజ్రాయెల్ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధ్యక్షతన వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ, వ్యవసాయ వర్సిటీ ఆలోచన తీరులో మార్పురావాలన్నారు. రైతులను ఇతర పంటలవైపు మళ్లించడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వరి మడులలో చేపలు ఉత్పత్తిచేసే అవకాశం ఉన్నదని.. ఆ దిశగా అధికారులు ప్రయత్నంచేయాలని చెప్పారు.
వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతికత వినియోగం పెరగాల్సిన అవసరమున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. యాంత్రీకరణలో ఉబెర్, ఓలా తరహా సేవలు వ్యవసాయరంగంలో అందిస్తే విప్లవాత్మక మార్పుకు నాంది పలికినట్టవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఐటీ, పరిశ్రమలశాఖ చొరవ తీసుకోవాలని కోరారు. రైతు వేదికల ద్వారా కర్షకులకు ఉత్తమ సేవలను అందించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయమే సీఎం కేసీఆర్కు ప్రాధాన్య అంశమని చెప్పారు. కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయలేక కేంద్రం చేతులెత్తేసే పరిస్థితికి తెలంగాణ ఎదిగి వచ్చిందన్నారు. వానకాలంలో రైతులు పత్తి పంటను పెద్ద ఎత్తున సాగుచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విపక్షాలు రైతుల ప్రయోజనాలను వదిలేసి రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు ఉద్యాన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని రవాణాశాఖ మం త్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఈ ఏడాది మిరపలో తామర, గత ఏడాది పత్తిలో గులాబీ పురుగులు రైతులను దెబ్బతీశాయని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. ఇందుకోసం రైతులను క్షేత్రస్థాయి సందర్శనకు పంపిస్తున్నట్టు తెలిపారు. పంట ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో గోదాముల సంఖ్య పెంచి నిల్వసామర్ద్యం పెంచాలన్నారు. పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాల్సిన అవసరమున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు అవసరైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిజామాబాద్, కామారెడ్డిలో దాల్ మిల్లను ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరికల్చర్ సాగు ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. దేశంలో ధాన్యం ఉత్పత్తి పెరిగి, వినియోగం తగ్గుతున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయపంటలు వేయాలని కోరారు. తప్పనిసరి అయితే యాసంగిలో నూకశాతం తక్కువగా ఉండే వంగడాలను సాగు చేయాని, ఉష్ణోగ్రతలు పెరుగకముందే కోతలు పూర్తిచేస్తే నూక తక్కువ ఉంటుందన్నారు. అంతరపంటగా కొకొవాను ప్రోత్సహించాలని సూచించారు. సాగునీటి వసతి పెరుగటం, మార్కెట్ గ్యారెంటీ ఉండటంతో వరి, పత్తిసాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. రైతులను వైవిధ్య పంటలవైపు ప్రోత్సహించాలన్నారు. భూముల రకాలకు అనుగుణంగా పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. రాష్ట్రంలో విత్తనశుద్ధి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని సూచించారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నదని, ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాలమీద దృష్టి సారించాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లారాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వీసీలు ప్రవీణ్రావు, నీరజా ప్రభాకర్ , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీకి మంత్రి సబిత హాజరయ్యారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి సబితకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలో సబితా ఇంద్రారెడ్డి మొక్క నాటారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి నివాసానికి పలువురు అర్చకులు వచ్చి సబితా ఇంద్రారెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ తరం యువత వ్యవసాయంపై ఆసక్తి చూపడంలేదని, వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువతరం ఈ రంగంవైపు మళ్లే అవకాశం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు ఈ దిశగా ఆలోచించాలన్నారు. చిన్నప్పటినుంచే పిల్లల్లో ఎవుసంపై మక్కువ కలిగేలా చేయాలని కోరారు. రాష్ట్రంలో నీలి, గులాబీ, తెలుపు, పసుపు, హరిత విప్లవాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతుల్లో వ్యవసాయంపై మరింత అవగాహన పెంచడం కోసం ప్రతి జిల్లాలో 25 ఎకరాల విస్తీర్ణంలో రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఏడాదికి రెండుసార్లు పదిరోజుల పాటు వ్యవసాయ ప్రగతిపై ప్రతిరోజూ ఒక కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం క్యాలెండర్ రూపొందించి రైతు దినోత్సవం జరుపాలని అధికారులను ఆదేశించారు. ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్గా బీమా కంపెనీలతో మాట్లాడి శాస్త్రీయంగా కొత్త విధానం తీసుకొని రావాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడగండ్లు, అకాల వర్షాలను తట్టుకొనే వంగడాలను తయారుచేయాలని కోరారు. దేశంలో దాదాపు 65 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలమీద ఆధారపడిందని, అయినప్పటికీ దేశ జీడీపీలో వ్యవసాయరంగం వాటా 15% దాటడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఇందులో విఫలమయ్యారని విమర్శించారు. 1987లో చైనా, ఇండియా జీడీపీ సమానమని.. ఇప్పుడు చైనా ఆదాయం 16 ట్రిలియన్ డాలర్లకు చేరితే.. ఇండియా 3 ట్రిలియన్ల వద్దే ఉండిపోయిందని తెలిపారు.