సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండల కేంద్రం లో బుధవారం మన ఊరు మన బడి పథకం లో భాగంగా నూతనంగా ఆధునీకరించిన మండల పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఒక తరం చదువు అభ్యసిస్తే ఇక ఆ సమాజానికి తిరుగులేదని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు -మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పాఠశాల ఆవరణ అహ్లాదకరంగా ఉంటేనే చదువులు సరైన పద్ధతిలో కొనసాగుతాయని అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం రూ. 7,289 కోట్లను ఖర్చు పెడుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రూ. 117 కోట్లు కేటాయించారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో సర్కారు బడి వద్దన్న రోజులు పోయి ప్రస్తుతం సర్కారు చదువులు కావాలనే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకులాల లో అడ్మిషన్ ల కోసం పెరుగుతున్న పోటీ యే ఇందుకు నిదర్శనమని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం వెయ్యి గురుకులాలు ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు.
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ ప్రశ్నించే స్థాయిలో లేరని అన్నారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని వెల్లడించారు. అనంతరం నూతన తరగతి గదుల్లో అధ్యాపకుడిగా మారి చిన్నారులతో కలిసి బెంచ్పై కూర్చున్నారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
చివ్వెంల మండల కేంద్రం లో మంత్రి రూ. 80 లక్షల వ్యయం తో చేపట్టిన నూతన పశువుల దవాఖానను ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ భవనానికి, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపీపీ కుమారి బాబునాయక్, జడ్పీటీసీ సంజీవ నాయక్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.