సిద్దిపేట : పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలి. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని ప్రతి విద్యార్థి పాటించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంగళవారం నంగునూరు మండలం ముండ్రాయి మండల ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడంపై మంత్రి మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల ఆవరణ ప్రాంగణం బురదమయంగా మారిందని మొరం పోయించి చదును చేయించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలు, తరగతుల నిర్వహణ, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. పాఠశాలకు వచ్చే విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఏంకు సూచించారు.
పాఠశాలలోని మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా.. లేవా అంటూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరోనా నేపథ్యంలో పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.