జోగులాంబ గద్వాల : జిల్లాలో వైద్యాధికారుల ( Medical Officers ) పనితీరు మెరుగు పడాలని, వైద్య సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha) ఆదేశించారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు తప్పనిసరి చేయాలని సూచించారు. శనివారం ఐడీఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఇటీవల జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు వివిధ సమస్యలను గుర్తించానన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పాత ఫైల్స్ క్లియరెన్స్, పనికిరాని ఫర్నిచర్ తొలగించాలని ఆదేశించినప్పటికీ చాలాచోట్ల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత మెడికల్ అధికారులు బాధ్యతాయుతంగా లేకుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్నారు. లీవ్ లెటర్ రాయకుండా విధులకు గైర్హాజరైతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రిజిస్టర్ల నిర్వహణ, వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వైద్య సేవలకు రోగులు కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, వైద్య కేంద్రాల డాక్టర్లు, వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.