బూర్గంపహాడ్, ఆగస్టు 07 : విద్యుత్ స్తంభాల కొరతతో సుందరయ్యనగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రయితే సుందరయ్యనగర్ కాలనీ అంధకారమయంగా మారుతుందని, వీధి దీపాలు ఏర్పాటు చేసి కాలనీలో వెలుగులు నింపాలని స్థానికులు సంబంధిత పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. షిరిడీ సాయిబాబా ఆలయం నుండి మల్లి కృష్ణ ఇంటి వరకు ఒక్క స్తంభం కూడా లేకపోవడంతో కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు 20 నుంచి 30 కనెక్షన్లు ఇవ్వడంతో షార్ట్ సర్కూట్ జరిగి ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోతున్నాయని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు.
ఇటీవల గోదావరి 56 అడుగులకు చేరి వరదలు రావడంతో జామాయిల్ తోటలు, సమీప పొలాల నుంచి విష సర్పాలు, ఇతర కీటకాలు కాలనీలోని ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ కాలనీలో వెళ్లాలంటే ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కాలనీవాసులు భయపడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ, విద్యుత్ శాఖలు స్పందించి సుందరయ్యనగర్లో తక్షణమే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు.