రఘునాథపాలెం, నవంబర్ 30: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల రాష్ట్ర బంద్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను బంద్ చేయించారు. ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు ఇటికాల రామకృష్ణ, తుడుం ప్రవీణ్, వెంకటేశ్, మస్తాన్ మాట్లాడుతూ.. అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్నా ఇంకెంతకాలం ఈ పురుగుల అన్నం, నీళ్ల చారు పెడతారని ప్రశ్నించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం.. విద్యారంగాన్ని విస్మరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా, విద్యారంగంపై సమీక్ష నిర్వహించకుండా ప్రభుత్వం విద్యరంగాన్ని ఎలా బలోపేతం చేస్తుందని ప్రశ్నించారు.