హైదరాబాద్ : రాష్ట్రంలో బక్రీద్ ( Bakrid festival ) పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల ( Law and Order )పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ( DGP CV Anand ) స్పష్టం చేశారు. బుధవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన చర్చలు, అనంతరం ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశ నిర్ణయాల మేరకు ఈ నెల 27న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ పండుగ ఇతర పండుగల కంటే అత్యంత సున్నితమైనదని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఇటీవల పశువుల అక్రమ రవాణా ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల రవాణా విషయంలో కౌ స్లాటర్ యాక్ట్-1977, ట్రాన్స్పోర్ట్ యాక్ట్-1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ-1960 చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతరాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని, ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శాంతిభద్రతల విషయంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని డీజీపీ హెచ్చరిం చారు. పశువుల రవాణాపై ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప, నేరుగా రోడ్లపైకి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించకూడదని ఖురేషీలు, గోరక్షక బృందాలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి కె. ఇలంబర్తి, డైరెక్టర్ గోపి, శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, కార్తికేయ, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.